Bhadradri Crime : భద్రాద్రి జిల్లాలో రూ.90 లక్షల విలువైన 360 కేజీల గంజాయి పట్టివేత

3 months ago 69
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadradri Crime : భద్రాద్రి జిల్లాలో రూ.90 లక్షల విలువైన 360 కేజీల గంజాయి పట్టివేత

Bhadradri Crime : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.90 లక్షల విలువైన గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. జిల్లాలోని రెండు స్టేషన్ల పరిధిలో 360 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భద్రాద్రి జిల్లాలో రూ.90 లక్షల విలువైన 360 కేజీల గంజాయి పట్టివేత

భద్రాద్రి జిల్లాలో రూ.90 లక్షల విలువైన 360 కేజీల గంజాయి పట్టివేత

Bhadradri Crime : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.90 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒకే రోజు రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో 360 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. భద్రాద్రి జిల్లాలోనే గతంలో భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్న సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రత్యేక నిఘాతో గంజాయి రవాణాను సమర్థవంతంగా అడ్డుకుంటున్నామని స్పష్టం చేశారు. జిల్లాలోని రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకుని భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఎక్కడెక్కడ ఎంత?

పాల్వంచ పట్టణంలోని జీసీసీ గౌడౌన్ ఎదురుగా సాయంత్రం 4 గంటల సమయంలో పాల్వంచ ఎస్సై రాఘవ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా ఒక మారుతి బాలెనో TS10CDT/R9062 నెంబర్ కారులో తరలిస్తున్న 202 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారుగా రూ.50,55,000 లు ఉంటుంది. ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్ లోని డొంకరాయి అటవీ ప్రాంతంలో కొనుగోలు చేసిన మెగావత్ జైపాల్(34) అనే వ్యక్తి వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలానికి 100 ప్యాకెట్ల నిషేధిత గంజాయిని కారులో తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అలాగే టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట్యా తండా వద్ద ఎస్సై సైదా రవుఫ్ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా ఒక మారుతి బ్రెజా TG03 0141లో కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు పెనుగొండ వెంకట రాజు , బోదాసు తిరుపతిలు 79 ప్యాకెట్లలో 158 కేజీల గంజాయిని ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి ప్రాంతం నుంచి మహారాష్ట్ర, షోలాపూర్ నకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారుగా రూ.39,50,000 ఉంటుంది. ఈ రెండు ఘటనలలో సుమారుగా రూ. 90 లక్షల విలువ గల 360 కేజీల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకుని రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

Read Entire Article