BRS to Congress : సంక్షోభం అంచున బీఆర్ఎస్..! ఆలోపే మరికొంత మంది ఎమ్మెల్యేలు జంప్..?

2 months ago 89
ARTICLE AD

తెలంగాణాలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బోల్తా పడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారం కోల్పోయిన ఆ పార్టీకి లోక్ సభ ఫలితాలు… సరికొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా…మరికొంత మంది అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు.

ఇటీవలే జరిగిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (PTI)

ఇటీవలే జరిగిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (PTI)

తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు తిరుగులేని శక్తిగా చక్రం తిప్పిన బీఆర్ఎస్… ఓటమి తర్వాత పరిస్థితులు మారిపోతున్నాయి. పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం నెలకొనే పరిస్థితులు ఉన్నాయి.

గడిచిన వారం రోజుల్లో ముగ్గురు BRS శాసనసభ్యులు పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. తాజాగా శుక్రవారం చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన కాలె యాదయ్య హస్తం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

జూన్ 21వ తేదీన బాన్సువాడకు చెందిన రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆ రెండు రోజులకే జగిత్యాల నుంచి గెలిచిన డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. దీంతో కేవలం వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడారు.

గత నవంబర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. కేవలం 39 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇక ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయింది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత… ముగ్గురు BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. వీరిలో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ నుండి కడియం శ్రీహరి, భద్రాచలం నుంచి గెలిచిన తెల్లం వెంకట్ రావు ఉన్నారు. తాజా ఫిరాయింపులతో కలిపి మొత్తం ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు… కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆలోపే మరికొంత మంది….!

జూలై రెండో వారంలో బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ లోపే మరో ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత చెప్పారు.

పటాన్ చెరు నియోజకవర్గం నుంచి గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి హస్తం పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నట్లు సదరు సీనియర్ నేత తెలిపారు. గత మూడు రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఉన్నారని… చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఆయన చేరికకు సంబంధించి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని చెప్పుకొచ్చారు.

ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుతో తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ బలం 71కి చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న ఆ పార్టీ… కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా గెలిచింది.

“రాబోయే నాలుగున్నరేళ్లలో ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు వాటిల్లోద్దని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఆకర్షించటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను వర్తించకుండా ఉండాలంటే… కనీసం 26 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సి ఉంటుంది” అని రాజకీయ విశ్లేషకుడు మహ్మద్ జకీర్ అభిప్రాయపడ్డారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గట్టిగా సమర్థించుకుంటున్నారు. 'ఆరు నెలల్లో మా ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకులు మా పార్టీ ఎంతో కాలం నిలవదని అంటున్నారు. మేం ఎందుకు మౌనంగా ఉండాలి? మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి కదా' అని గురువారం న్యూ ఢిల్లీలో మాట్లాడుతూ సమాధానమిచ్చారు.

గత వారం ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన వెంటనే… కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో మిగిలిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తుపై భరోసా ఇస్తూ పార్టీలోనే ఉండాలని కోరారు. పోయినవాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

“ఈ ఫిరాయింపులతో కలవరపడాల్సిన అవసరం లేదు. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి నాయకులపై ఆందోళన విరమిద్దాం. ఈ ఫిరాయింపుదారుల స్థానంలో మంచి నాయకులను తయారు చేసే సత్తా పార్టీకి ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సత్తా బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంది" అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఓవైపు కేసీఆర్ తో సమావేశాలు నిర్వహిస్తూనే… మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారగా… మరికొంతమంది కూడా అదే బాటలో వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Read Entire Article