Cell Phones Recovery : మీ సెల్ ఫోన్ పోయిందా? టెన్షన్ వద్దు ఇలా చేయండి

1 month ago 50
ARTICLE AD

Cell Phones Recovery : సెల్ ఫోన్ల రికవరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా రికార్డు సృష్టించింది. దొంగతనానికి గురైన లేదా పోయిన సెల్ ఫోన్ లను రికవరీలో చేయడంలో 84 శాతం సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా 78 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు సిరిసిల్లలో ఎస్పీ అఖిల్ మహాజన్ అప్పగించారు.

ఏడాదిలో 1019 ఫోన్లు అప్పగింత

గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1200 సెల్ ఫోన్లు సీఈఐఆర్ టెక్నాలజీ ద్వారా గుర్తించి.. 1019 ఫోన్లు సంబంధిత బాధితులకు అప్పగించామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వాటి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఇటీవల రికవరీ చేసిన 78 సెల్ ఫోన్ లను బాధితులకు అప్పగించారు.‌ ఫోన్ ల రికవరీ లో 84 శాతంతో రాష్టంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో కమిషనరేట్స్ కాకుండా జిల్లాలతో పోల్చుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1019 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించిందని ఎస్పీ తెలిపారు. ఫోన్ దొరికిన బాధితులు మీ బంధువులలో, మీ గ్రామాలలో మీ స్నేహితులలో ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగినా ఎక్కడైనా పడిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలనే విషయంపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు.

సెల్ ఫోన్ పోయిందా...సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేయండి‌

సెల్ ఫోన్ పోయిందా.. అయితే టెన్షన్ పడవద్దు. వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కేంద్ర టెలికాం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెతికి పట్టుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సెల్ ఫోన్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి, లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి www.ceir.gov.in అనే వెబ్ సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/ స్టోలెన్ అనే లింక్ పై క్లిక్ చేసి, సెల్ ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. దీంతో పాటు ఏరోజు, ఎక్కడ పోయింది....రాష్ట్రం, జిల్లా, పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తరువాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. తద్వారా సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చన్నారు.

ఐటీ కోర్ సిబ్బందికి అభినందనలు

సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ 84 శాతం రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేసిన ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఎస్.ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ లను నగదు రివార్డులను అందజేశారు. పోయిన ఫోన్ దొరకదు అనుకున్న తరుణంలో పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు జిల్లా ఎస్పీకి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు

WhatsApp channel

Read Entire Article