CM Revanth Warangal Tour : నేడు వరంగల్ కు సీఎం రేవంత్​ రెడ్డి - కీలక హామీలపై ప్రకటన ఉంటుందా..!

2 months ago 85
ARTICLE AD

CM Revanth Reddy Warangal Tour : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన ఖరారు అయ్యింది. శుక్రవారమే ఆయన ఓరుగల్లు పర్యటనకు రావాల్సి ఉండగా, దిల్లీలో సమావేశం దృష్ట్యా అది కాస్త వాయిదా పడింది. దీంతో శనివారం(నేడు) ఆయన పర్యటనకు ముహూర్తం ఖరారైంది.

ఎలక్షన్​ కోడ్​ ముగిసిన తరువాత వరంగల్ నగరానికి ముఖ్యమంత్రి వస్తుండగా, ఆయన టూర్​ పైనే ఓరుగల్లు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే నగరానికి సంబంధించిన ముఖ్యమైన పనులు పెండింగ్​ లో ఉండగా, వాటికి మోక్షం కలుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పెండింగ్​ పనులతో పాటు జిల్లాకు కావాల్సిన కొత్త పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా రెడీ చేశారు.

ఐదు గంటలు నగరంలోనే..

సీఎం రేవంత్​ రెడ్డి వరంగల్ లో దాదాపు ఐదు గంటల పాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు. తన పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12.40 గంటలకు శంషాబాద్​ ఎయిర్​ పోర్టు నుంచి హెలిక్యాప్టర్​ లో బయలు దేరనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాకతీయ మెగా టెక్స్​ టైల్​ పార్కుకు చేరుకుని, అక్కడ వివిధ కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ ను 1.50 గంటల వరకు సందర్శిస్తారు. అక్కడి నుంచి వరంగల్​ సెంట్రల్​ జైల్​ స్థలంలో నిర్మిస్తున్న మల్టీ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలిస్తారు.

అక్కడి నుంచి 2.45 గంటల ప్రాంతంలో హనుమకొండలోని ఇంటిగ్రేటెడ్​ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్​ కాంప్లెక్స్ కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్​ ను ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్​ కాన్ఫరెన్స్​ హాలులో జీడబ్ల్యూఎంసీ అభివృద్ధి పనులపై అధికారులతో రివ్యూ చేస్తారు. ఆ తరువాత 5.30 గంటల ప్రాంతంలో వరంగల్ హంటర్​ రోడ్డులో కొత్తగా ఏర్పాటైన ‘మెడి కవర్’ అనే ప్రైవేటు ఆసుపత్రి ఓపెనింగ్​ కు చీఫ్​ గెస్ట్​ గా హాజరవుతారు.

అక్కడి నుంచి 6.10 గంటలకు ఆర్ట్స్​ కాలేజీ గ్రౌండ్​ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్​ కు చేరుకుని హైదరాబాద్​ కు తిరుగుప్రయాణం కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. తమతమ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన పనులను స్థానిక ఎమ్మెల్యేలు పరిశీలించారు.

అభివృద్ధి పనులపై ఆశలు

వరంగల్ నగరానికి సంబంధించి ముఖ్యమైన పనులు చాలా వరకు పెండింగ్​ లోనే ఉన్నాయి. రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ ను తీర్చిదిద్దుతామని ఇదివరకే సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటన చేయగా, తన పర్యటనలో భాగంగా ఏమేం పనులు మంజూరు చేస్తారోనని ఆసక్తి నెలకొంది.

కాగా వరంగల్ నగరానికి ప్రధానంగా మాస్టర్​ ప్లాన్​ అమలు విషయం చాలా ఏళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్​ లో ఉంది. 2013లో మాస్టర్​ ప్లాన్​ రూపొందించిన ఇంతవరకు దానికి ఆమోదం లభించలేదు. దీంతో మాస్టర్​ ప్లాన్​ పై ప్రకటన చేస్తారనే చర్చ జరుగుతోంది. అంతేగాకుండా వరంగల్ కు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం సమస్యగా మారగా, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ వ్యవస్థ మాటలకే పరమితం అవుతోంది. దీంతో వందల కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుపైనా ప్రకటన వెలువడే ఛాన్స్​ ఉందని ప్రచారం సాగుతోంది

పాత పనులకు మోక్షం కలిగేనా..?

గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి పెండింగ్​ లో పడిపోయిన పనులు వరంగల్ లో చాలానే ఉన్నాయి. అందులో ప్రధానంగా వరంగల్ ఇన్నర్​ రోడ్డు, స్మార్ట్​ సిటీ వర్క్స్​, ఇండస్ట్రియల్​ కారిడార్​, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులన్నాయి. ఈ పనులన్నీ గత కొంతకాలంగా అసంపూర్తిగానే ఉండగా, వాటన్నింటినీ పూర్తి చేసి ఓరుగల్లు సుందరంగా తీర్చి దిద్దుతామని సీఎం రేవంత్​ రెడ్డి ఇదివరకే ప్రకటించారు.

ఈ మేరకు వాటి పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. అంతేగాకుండా వరంగల్ మామునూరు ఎయిర్​ పోర్టు అంశం తరచూ తెరమీదకు రావడం, ఆ తరువాత తెరమరుగవడం సాధారణమైపోయింది. దీంతో వరంగల్ ఎయిర్​ పోర్టు విషయంపైనా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం రేవంత్​ రెడ్డితో సరైన ప్రకటన చేయించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మరి సీఎం రేవంత్​ రెడ్డి తన పర్యటనలో ఓరుగల్లు అభివృద్ధికి ఎలాంటి ప్రకటనలు చేస్తారో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Read Entire Article