Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

3 months ago 80
ARTICLE AD

Tourist Spots in Karimnagar District:  ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. దేశంలోనే ఎంతో పేరొందిన సిల్వర్ ఫిలిగ్రీతోపాటు నల్లబంగారం గనులకు ప్రసిద్ధి చెందిన సింగరేణి ఈ ప్రాంతంలోనే ఉంది. వెలుగులు విరజిమ్మే రామగుండం ఎన్టీపిసి...రాముడు నడియాడిన నేల ఇలా ఎన్నో చారిత్రక స్థలాలు, కట్టడాలు, ఆధ్యాత్మికతను పరిమళింపజేసే ఆలయాలు ఆకర్షిస్తున్నాయి.

వందేళ్ళ నాటి ఎలగందుల ఖిల్లా :

కాకతీయులు, బహమనీలు, కుతుబ్షాహీలు, మొగలులు, అసఫ్ జాహీలకు రాజధానిగా విలసిల్లిన ఎలగందుల కరీంనగర్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి కోట కొండపై మసీదు ఉంది. దాని మీనార్ ఒకటి కదిపితే కదులుతుందని అంటారు. లోపల బంగారు రంగు చిత్రాలు చూపరులను ఆకర్షిస్తాయి.

కొండల మధ్య రాముని గుండాలు :

రామగుండం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య ముచ్చగొలిపే చారిత్రక ప్రాంతం రాముని గుండాలు. కొండపైకి ఎక్కి చూస్తే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలిపే గోదావరి నది, సింగరేణి బొగ్గు గనులు, వెలుగులు విరజిమ్మే రామగుండం ఎన్టీపిసి విద్యుత్ కేంద్రం కనువిందు చేస్తాయి.

నాలుగు నూర్ల దేవాలయాలు :

కరీంనగర్ జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగునూరులో పూర్వం చాళుక్యులు, కాకతీయుల సామంతరాజులు 4 గుట్టలను కలుపుతూ కోటను నిర్మించి, పరిపాలన సాగిం చారు. బౌద్ధుల కాలం నాటి శాసనాలు, విగ్రహాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. గంగాధరుడు నిర్మించిన త్రికూటాలయం నాటి శిల్పకళా ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒకప్పుడు 400 దేవాలయాలు ఉండేవని, నాలుగు నూర్ణ దేవాలయాలు ఉన్న ఊరు కాస్త నగునూరుగా స్థిరపడిందని చరిత్ర చెబుతోం ది గ్రామం వెలుపల అతి సుందరమైన పెద్ద నాగశిల్పం ఉంది. హైదరాబాద్ కు చెందిన కాసుగంటి నారాయణరావు ట్రస్టు ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.

దక్షిణకాశీ.. వేములవాడ:

కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆదాయం లో తిరుపతి తర్వాత రెండోది, దక్షిణకాళీగా కీర్తిగాంచిన ఈ ఆలయాన్ని కళ్యాణి చాళుక్య వంశీయుడైన ఆరో విక్రమా దిత్యుడు వెయ్యేళ్ల క్రితం నిర్మించాడని శాసనాలు చెబుతు న్నాయి. కోడె మొక్కు ఆచారం ఇక్కడ తప్ప రాష్ట్రంలో మరె క్కడా లేదు. మతసామరస్యానికి ప్రతీకగా దర్గాతోపాటు జైన దేవాలయాలు ఇక్కడ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

శాతవాహనుల రాజధాని..కోటిలింగాల:

శాతవాహనుల రాజధాని కోటిలింగాల, వెల్గటూర్ మండ లానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఎక్కడ చూసినా శివలింగాలు, శిల్పకళా ఖండాలు, ఖండాల ఖండిక లు కనిపిస్తుంటాయి. పురవాస్తు శాఖవారు జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల హయాంలోని నాణేలు. ఇతర స్మారక చిహ్నలు వెలుగుచూశాయి. ఇక్కడి గోదావరినది నది ఒడ్డున శ్రీకోటేశ్వరస్వామి ఆలయం ఉంది.

త్రివేణి సంగమ క్షేత్రం.. కాళేశ్వరం:

కరీంనగర్ కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం.. శ్రీశైలం, ద్రాక్షారామం అంతటి విశిష్టమైంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులు సంగమించే చోటిది. ప్రధాన ఆలయం లో కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి లింగాలు ఒకే పానపట్టంపై ఉండటం విశేషం. ఇక్కడి లింగంపైన గల నాసికలో ద్రవం పోస్తే త్రివేణి సంగమంలో కలుస్తుందని ప్రతీతి. 

ప్రధాన ఆలయానికి కిలోమీటర్ దూరంలో ముక్తీశ్వరాలయం ఉంది. దీని చుట్టూ ఉన్న చిన్నచిన్న రాళ్లలో నుంచి విభూది రాలడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాళేశ్వరంకు 26 కిలోమీటర్ల దూరంలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలిమెట్టు మేడిగడ్డ. కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మి పంప్ హౌజ్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో తొలి పంప్ హౌజ్ గా ప్రసిద్ది చెందింది.

నృసింహుని క్షేత్రం.. ధర్మపురి :

కరీంనగర్ కు ఉత్తరాన 70 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి నృసింహుని క్షేత్రం ఉంది. అర్ధాయుష్కు డైన కుమారుడి కోసం బలివర్మ మహారాజు దేవతాయాగం చేసి, విజయం సాధించడం, ప్రజలు ధర్మబద్ధంగా జీవించడం కారణంగా ధర్మపురిగా వాసికెక్కింది. పద్మాసనంలో లక్ష్మీ సమేతుడై వెలసిన నరసింహస్వామితోపాటు, రామలింగేశ్వరాలయం పక్కపక్కనే ఉండి శైవ, వైష్ణవ సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

కోర్కెలు తీర్చే అంజన్న.. కొండగట్టు :

మల్యాల మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు. కరీంనగర్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 300 ఏళ్ల కింద ఈ ఆలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇప్పుడున్న గుడి మాత్రం 160 ఏళ్ల కింద కృష్ణారావు దేశముఖ్ నిర్మించారు. భక్తుల కోర్కెలు తీర్చే దేవునిగా ఆంజనేయస్వామీగా పేరు పొందారు. కొండల రాయుని కోట, గుహలు, బొజ్జ పోతన, సీతమ్మవారి కన్నీటి గుంటలు చూడదగినవి. ఏటా రెండు సార్లు ఇక్కడ హనుమాన్ జయంతి వేడుకలు జరుగడం ప్రత్యేకత.

మంత్రపురి.. మంథని :

అనాదిగా వైదిక సంస్కృతి వైభవాన్ని పరిరక్షిస్తున్న మంత్రపురి ప్రస్తుతం మంథనిగా పిలువబడుతోంది. కరీంనగర్ కు 70 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరాన వెలసిన గౌతమే శ్వరాలయంలోని బ్రాహ్మణోత్తములు వేదాధ్యయనంలో మేటిగా నిలిచారు. అప్పట్లో మంథనికి వాస్తు అక్కరలేకుండా నాలుగు దిక్కులా 4 శివలింగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం వాటిని దాటి, విస్తరించింది.

రామాలయం.. ఇల్లందకుంట :

హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఇల్లందకుంట మండల కేంద్రంలో శ్రీసీతారామచం ద్రస్వామి ఆలయం ఉంది. దండకారణ్యంలో వనవాసం చేస్తున్న సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతానికి చేరుకున్నారని. దశరథుని మరణవార్త తెలిసి ఇల్లంద గింజలతో తర్పణం వదిలారని ప్రతీతి. నల్లగొండ జిల్లాకు చెందిన రాఘవరెడ్డి ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది.

రాజ భవనాలు.. రామగిరి ఖిల్లా:

పెద్దపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరాన శత్రుదుర్భేద్యమైన రామగిరి ఖిల్లా ఉంది. ఇక్కడి కోటలో సీతారామలక్ష్మణలు కొంతకాలం నివసించి దాతుర్మస్య వ్రతం ఆచరించినట్లు స్థానికులు చెప్పుకుంటారు. కోట లోపల గల అనేక రాజ భవనాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడి ప్రకతి సౌందర్యానికి ఆకర్షితుడైన ఔరంగజేబు దీన్ని ఆరామ్ గిరి అని పిలిచారంటారు.

సైనిక స్థావరం.. జగిత్యాల ఖిల్లా :

కరీంనగర్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల ఖిల్లాను జాఫరుద్దాలా హయాంలో ఫ్రెంచ్ ఇంజినీర్లు నిర్మించారు. 20 ఎకరాల విస్తర్ణంలో పూర్తిగా రాతితో నిర్మించిన ఈ ఖిల్లా నాడు సైనిక స్థావరంగా ఉండేది. ఇప్పటికీ చెక్కు చెదర కుండా చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది.

బౌద్ధ స్తూపం.. ధూళికట్ట :

ఎలిగేడు మండలంలోని ధూళికట్ట గ్రామం కరీంనగర్ కు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1975 నుంచి 77 వరకు జరిపిన తవ్వకాల్లో నాటి కోట, బౌద్ధ స్తూపం బయటపడ్డాయి. కోట ముఖద్వారం వద్ద రాగి నాణేలు, మట్టి బొమ్మలు దొరికాయి,

పురావస్తు ప్రదర్శన శాల :

కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న పురావస్తు ప్రదర్శన శాలను 1964లో నెలకొల్పి, 1984లో అదునీకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తవ్వకాల్లో వెలుగుచూసిన శాతవాహనులు, కాకతీయులు, అసఫ్జాహీల చిహ్నాలు, నాణేలు, స్టాంపులు, యుద్ధ సామగ్రి, పుణ్యక్షేత్రాల అవశేషాలను ఇక్కడ ఉంచారు.

సైఫన్.. నాగులపేట

కోరుట్లకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగులపేట సైఫన్ ఆసియా ఖండంలోనే అరుదైన నిర్మాణంగా కీర్తిగాంచింది. భూగర్భంలోకి కాలువలోని నీరు మాయమై, వాగు దాటాక తిరిగి ప్రత్యక్షమవుతుంది. కింద కాలువ, పైన వాగు ఉండటం ఈ సైఫన్ ప్రత్యేకత.

వీరభద్రస్వామి.. కొత్తకొండ

భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ కోరమీసాల వీరభద్ర స్వామి దేవస్థానం అతి పురాతనమైంది. కాకతీయ రుద్రేశ్వరుని కాలం క్రీ.శ. 1410లో మల్లికార్జున పండితుని మనవడైన కేదారిచే ఆలయ నిర్మాణం జరిగింది. ఏటా సంక్రాంతికి జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.

ఆలయాలు.. ప్రత్యేక ప్రాంతాలు

సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో దుబ్బ రాజేశ్వరస్వామి, ఓదెల మల్లికార్జునస్వామి, ఇల్లంతకుంట మండలంలోని జంగంపల్లి శ్రీరామలింగేశ్వర స్వామి, గంగాధర మండలంలోని నందగిరి లక్ష్మీనర్సింహస్వామి, రాయికల్లోని కేశవనాథ పంచముఖ లింగేశ్వర త్రికూట ఆలయాలు, కోరుట్ల మండలంలోని నాగులపేట సైఫన్, మొలంగూరు ఖిల్లా సందర్శించదగినవి. 

ఇక కరీంనగర్ లో సమీపంలో మానేర్ వాగుపై తీగల వంతెన, లోయర్ మానేర్ డ్యామ్ ఉన్నాయి. డ్యామ్ ప్రక్కనే ఉజ్వల పార్క్, డీర్ పార్క్ పర్యాటకులను ఆకర్శిస్తున్నాయి, నిర్మాణంలో ఉన్న మానేర్ రివర్ ప్రంట్ పూర్తి అయితే మరింత పర్యాటక శోభ కరీంనగర్ కు రానుంది.

రిపోర్టింగ్ -HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR

Read Entire Article