Khammam : చిన్నారిపై అఘాయిత్యం కేసు - నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

3 months ago 62
ARTICLE AD

Khammam Crime News : అభం శుభం ఎరుగని చిన్నారిని చెరిచిన కామాంధుడికి తగిన శిక్ష పడింది. కామంతో కళ్ళు మూసుకుపోయి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందుతుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. 55 వేల రూపాయల జరిమానా కూడా విధిస్తూ ఖమ్మం1వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి కె. ఉమాదేవి గురువారం తీర్పు వెలువరించారు.

మహిళలు, చిన్నారులపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ నిందితులు చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని తప్పించుకు తిరుగుతున్నారు. కాగా ఆరేళ్ళ చిన్నారిపై అమానవీయ రీతిలో జరిగిన ఈ అఘాయిత్యానికి సంబంధించిన సాక్షాలను తీసుకొచ్చి రుజువు చేయడంతో కామాంధుడికి ఎట్టకేలకు శిక్ష పడింది.

ఇదీ సంగతి…..

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం చిమ్మపూడి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కంపాటి కార్తీక్ (20) అదే గ్రామంలో ఉంటున్న 6 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు. 2023 మార్చి 5 న సాయంత్రం ఆటోలో ఇంటి నుంచి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి ఆభంశుభం తెలియని బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఈ ఘటనపై రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ లో 2023 మార్చి 6వ తేదీన బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో క్రైమ్ నెంబర్ 54/2023. U/S:366A,376 IPC సెక్షన్ 5 r/w 6 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన రఘునాథపాలెం పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలు ఒక చిన్నారి కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణలో వేగం పెంచారు. 

దర్యాప్తులో నిందుతుడి పాత్ర స్పష్టంగా కనిపిస్తుండటంతో పకడ్బందీగా సాక్ష్యాలు సేకరించి న్యాయ స్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు రుజువు కావడంతో 1వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు జడ్జి ఉమాదేవి.. ఆ కామాంధుడిని దోషి గా నిర్దారించి 20 ఏళ్లు జైలు శిక్ష విధించడంతో పాటు 55 వేల రూపాయలు జరిమానా విధించారు. 

నిందుతులకు శిక్ష పడటంలో కీలకపాత్ర పోషించిన దర్యాప్తు అధికారి ఏసీపీ భస్వారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.శంకర్, భరోసా లిగల్ అధికారి యం. ఉమారాణి,కోర్టు కానిస్టేబుల్ జి.రవి కిషోర్, కోర్ట్ లైజనింగ్ అధికారులు హెడ్ కానిస్టేబుళ్లు కె.శ్రీనివాసరావు, మోహన్ రావు, హోంగార్డు అయూబ్ లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

Read Entire Article