Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, విచారణ పరిధి జూబ్లీహిల్స్ పీఎస్ కు మార్పు

3 months ago 99
ARTICLE AD

Phone Tapping Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ జరుగుతున్న పరిధి మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మార్చారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాధాకృష్ణన్ రావు నుంచి బంజారాహిల్స్ పోలీసులు అత్యంత కీలమైన సమాచారాన్ని రాబట్టారు. ఉన్నపళంగా కేసు విచారణ మార్పునకు కారణాలపై దర్యాప్తు అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఈ కేసులో కీలక సమాచారాన్ని సేకరించిన అధికారులు, మరి కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. పోలీసు అధికారులతో పాటు ప్రైవేట్ వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేందుకు దర్యాప్తు అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

దర్యాప్తు వేగవంతం

ఫోన్ ట్యాపింగ్, స్పెషల్ ఇంటెలిజెన్స్ లాకర్ రూం ధ్వంసం చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. గతేడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లారు. అయితే ప్రభాకర్ రావు భారత్ కు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమచారం. ఈనెల చివరిలో ప్రభాకర్ రావు భారత్ కు రావాల్సి ఉంది. మరోవైపు రెడ్ కార్నర్ నోటీసులు, కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభాకర్ రావు త్వరలోనే భారత్ కు వచ్చి దర్యాప్తు అధికారులకు సహకరిస్తారని ప్రచారం సాగుతోంది. కాగా ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కాగా లోక్ సభ ఎన్నికలు ముగియడంతో పోలీసులు ఈ కేసు విచారణను వేగవంతం చేశారు.

ఈనెల ఆఖరిలో ఇండియాకు ప్రభాకర్ రావు?

ఇటు ప్రభాకర్ రావుతో పాటు 6వ నిందితుడుగా ఉన్నా ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్ విచారణ కూడా ఈ కేసులో కీలకంగా మారనుంది. దీంతో వీరిని భారత్ కు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. వీరిపై ఇప్పటికే నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రక్రియలో భాగంగా... సెక్షన్ 73 సీఆర్పీసీ కింద సంబంధించిన సమాచారం ఇప్పటికే ఇమ్మిగ్రేషన్, ఇంటర్ పోల్ కు అధికారులు అందించారు. ఈ ప్రక్రియ పూర్తి కాకముందే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ లుకౌట్ సర్కులర్ ఉన్నందున, ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆ తరువాత పోలీసులకు అప్పగిస్తారు. ఇదంతా ఒక్కేతైతే ఇప్పుడు ఈ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు మార్చడం మరో సంచలనంగా మారింది.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలువురు పోలీస్ అధికారులు ప్రతిపక్ష నేతలతో పాటు పాటు వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Read Entire Article