Siddipet Crime : ఖరీదైన బైక్ లు చోరీ, ఆన్ లైన్ లో అమ్మకం- 19 బైక్ లు స్వాధీనం!

2 months ago 55
ARTICLE AD

Siddipet Crime : ఇంటి ముందు పార్క్ చేసే అధునాతన ఖరీదైన ద్విచక్ర వాహనాలను దొంగిలించి ఆన్లైన్ లో అమ్ముతున్న అంతర్ జిల్లా బైక్ ల దొంగను సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. నిందితుడి నుండి 40 లక్షల విలువైన 19 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట సీపీ అనురాధ తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన కుమ్మరి సాయికుమార్ కారు డ్రైవర్ గా పనిచేస్తూ వచ్చిన డబ్బులు సరిపోక అధునాతన బైక్ లను చోరీ చేస్తుంటాడు.

పలు జిల్లాలో కేసులు ..... పలుసార్లు జైలుకు

సాయి కుమార్ 2020లో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 దొంగతనం కేసులలో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఆ తర్వాత జైలు నుంచి వచ్చినా అతని బుద్ధి మార్చుకోలేదు. దీంతో మరల దొంగ ప్రవృత్తిని కొనసాగిస్తూ సుల్తాన్ బజార్, పెట్ బషీర్ బాగ్, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడి చెంచల్ గూడ, నిజామాబాద్, చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించాడు. 2022లో జైలు నుంచి విడుదలైన తరువాత వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనాలు చేస్తూ ఆ వాహనాలను వివిధ స్థలాలలో దాచి పెట్టి ఆన్ లైన్ లో అమ్ముకొని డబ్బులు సంపాదించేవాడు.

19 బైక్ లు రూ. 45 వేల నగదును స్వాధీనం

మార్చి 26న సిద్ధిపేటలోని గణేష్ నగర్ చెందిన విఠకాల రవికుమార్ తన ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్ ను దొంగతనం చేశాడు సాయికుమార్. దీంతో రవికుమార్ సిద్ధిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆ బైక్ ను అమ్మడానికి సిద్ధిపేట మీదుగా వెళ్తున్న క్రమంలో అనుమానాస్పద పరిస్థితులలో క‌నిపించిన అతనిని అదుపులోకి తీసుకుని విచారించ‌గా ద్విచ‌క్ర వాహ‌నాల దొంగ‌త‌నాల‌కు పాల్పడుతున్న విష‌యం వెలుగులోకి వచ్చింది. విచారణలోహైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో 4 పల్సర్,4 రాయల్ ఎన్ ఫీల్డ్, 9 కేటీఎం, 2 హీరో హోండా వాహనాలు చోరీ చేశాడు. మొత్తం చోరికి గురైన 19 ద్విచ‌క్ర వాహ‌నాలు, రూ. 45 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అధికారులు, సిబ్బందిని అభినందిన సీపీ

మోటార్ సైకిళ్ల దొంగతనం చేసిన నేరస్తుడిని చాకచక్యంగా పట్టుకొని 19 మోటార్ సైకిళ్లు రికవరీ చేసినందుకు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ నరసింహారావు, సీసీఎస్ సిబ్బంది యాదగిరి, కిషన్, సిద్దిపేట వన్ టౌన్ సిబ్బంది కనకరాజు, భూమలింగం, యాదగిరి, ఐటీ కోర్ కానిస్టేబుల్ శ్రీకాంత్ లను సీపీ అనురాధ అభినందించి త్వరలో రివార్డు అందజేస్తామని తెలిపారు.

Read Entire Article