TG ITI Centres: అధునాత‌న సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు, మల్లేపల్లిలో నేడు శిక్షణా కేంద్రాలకు రేవంత్‌ శంకుస్థాపన

3 months ago 58
ARTICLE AD

TG ITI Centres: ఆధునిక ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా యువ‌త‌ను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐల‌ను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) మార్చాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం ఐటీఐల‌ను ఏటీసీలుగా తీర్చిదిద్దాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని 65 ఐటీఐల‌ను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకురాష్ట్ర ప్ర‌భుత్వం టాటా టెక్నాల‌జీస్ లిమిటెడ్ (టీటీఎల్‌)తో ప‌దేళ్ల‌కుగానూ అవ‌గాహ‌న ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఏటీసీల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు మ‌ల్లేప‌ల్లి ఐటీఐలో శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

తెలంగాణలో 65 ఐటీఐల‌ను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తారు.ఆధునిక ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఏటీసీల్లో యువ‌త‌కు శిక్ష‌ణ ఇస్తారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాత‌న సామ‌గ్రి, సాంకేతిక‌త ఏర్పాటు చేస్తారు.

ఏటీసీల్లో శిక్ష‌ణ ఇచ్చేందుకు 130 మంది నిపుణుల‌ను టీటీఎల్ నియ‌మిస్తుంది. ఏటీసీల్లో ఏటా 15,860 మందికి ఆరు ర‌కాల దీర్ఘ కాల (లాంగ్ ట‌ర్మ్‌) కోర్సుల్లో, 31,200 మందికి 23 ర‌కాల స్వ‌ల్ప కాలిక (షార్ట్ ట‌ర్మ్‌) కోర్సుల్లో శిక్ష‌ణ అందిస్తారు.

గ‌త ప‌దేళ్ల‌లో రాష్ట్రంలోని ఐటీఐల్లో కేవ‌లం 1.5 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే శిక్ష‌ణ పొందారు. ఈ ఏటీసీల‌తో రానున్న ప‌దేళ్ల‌లో నాలుగు ల‌క్ష‌ల మంది శిక్ష‌ణ పొందనున్నారు.

ఐటీఐల‌ను ఏటీసీలుగా మార్చే ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.2,324.21 కోట్లను ఖర్చు చేస్తారు. ఇందులో రాష్ట్ర ప్ర‌భుత్వం వాటా రూ.307.96 కోట్లు (13.26 శాతం) కాగా టీటీఎల్ వాటా రూ.2016.25 కోట్లు (86.74)గా ఉంది.

ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్ష‌ణకే ప‌రిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ప‌ని చేస్తాయి. అలాగే ఈ ఏటీసీలు ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌లతో పాటు చిన్న‌, సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, భారీ ప‌రిశ్ర‌మ‌ల‌కు సాంకేతిక కేంద్రాలుగానూ (టెక్నాల‌జీ హ‌బ్‌) ప‌ని చేస్తాయి.

ఏటీసీల్లో వివిధ కోర్సుల్లో శిక్ష‌ణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది. ఏటీసీలు భ‌విష్య‌త్తులో త‌మ సేవ‌ల‌ను పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు కూడా అంద‌జేస్తాయి.

Read Entire Article