TGSRTC Automatic Fare Issue : టీజీఎస్ఆర్టీసీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ వివాదం, రవాణా మంత్రికి ప్రశ్నలు సంధించిన బీఆర్ఎస్

3 months ago 61
ARTICLE AD

TGSRTC Automatic Fare Issue : టీజీఎస్ఆర్టీసీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ విధానంలో నిబంధనలు పాటించలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. టెండర్లు పిలవకుండా కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ ను ఓ కంపెనీకి కట్టబెట్టారని బీఆర్ఎస్ ఆరోపించింది. దీనిపై టీజీఎస్ఆర్టీసీ వివరణ ఇచ్చింది. అయితే తాజాగా టీజీఎస్ఆర్టీసీ వివరణపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మరోసారి లేఖ రాశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ కోసం ఏ టెండర్ లేకుండా ఓ కంపెనీకి కట్టబెట్టారనడానికి టీజీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యం విడుదల చేసిన వివరణతో స్పష్టం అవుతుందని ఆరోపించారు.

రవాణా మంత్రికి బీఆర్ఎస్ ప్రశ్నలు

"ప్రభుత్వ కమిటీ మార్చి 4న చర్చలు జరిపిందని లెటర్ ఆఫ్ ఇంటెంట్ స్పష్టంగా పేర్కొందని, అయితే ఫిబ్రవరి 29న మునుపటి టెండర్‌ను రద్దు చేసినట్లు ప్రభుత్వం పత్రికా ప్రకటన పేర్కొంది. ఆ తర్వాత టీజీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారుల బృందం దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లి, ప్రభుత్వ అధికారులను కలిశారు. ఇతర రాష్ట్రాల్లోని అధికారులు, వారి అభిప్రాయాలను తీసుకుని, సాంకేతిక నైపుణ్యం, నాణ్యత, కార్యకలాపాలు, ఆర్థిక ఇతర అంశాలను అధ్యయనం చేసి, ఆపై చలో మొబిలిటీకి అనుమతి ఇచ్చారు. టీజీఎస్ఆర్టీసీ ప్రతినిధి బృందం కేవలం 3 రోజుల్లో అధ్యయనం ఎలా ముగించగలరు, వారు ఎన్ని రాష్ట్రాల్లో పర్యటించారు? ప్రతినిధి బృందంలోని సభ్యులు ఎవరు, వారు ఎన్ని రాష్ట్రాల్లో పర్యటించారు, వారు ఏ అధికారులను కలిశారు, 2022లో ఇచ్చిన కాంట్రాక్ట్‌ను 2023లో రద్దు చేశారు. కానీ రద్దు చేసిన తర్వాత కేవలం 3 రోజుల్లో మరో నిర్ణయం తీసుకున్నారు. ఈ కాంట్రాక్టును ఫలానా కంపెనీకి గిఫ్ట్ గా ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ముందుగానే ఉందనే అనుమానం వస్తుంది" అని బీఆర్ఎస్ ప్రశ్నించింది.

"టీజీఎస్ఆర్టీసీ ప్రెస్ నోట్ ప్రకారం ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ కోసం 2022లో 6 కంపెనీలు పోటీ పడ్డాయి, 2024లో కేవలం 3 కంపెనీలు మాత్రమే పోటీ పడ్డాయి, ఆ కంపెనీలు ఏవి? చలో మొబిలిటీ బిడ్డింగ్‌లో పాల్గొందా? ప్రభుత్వ నోట్‌లో పేర్కొన్న విధంగా ఏ కంపెనీ అవసరాలను తీర్చకపోతే, సాధారణంగా పేరున్న కంపెనీలు టేబుల్‌పై చర్చలు జరపడానికి ఇష్టపడవు. అప్పుడు ఆన్‌లైన్ టెండర్లకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, గ్లోబల్ టెండర్లను ఎందుకు పిలవలేదు? టెండర్లు, కొనుగోళ్లకు ప్రముఖమైన టీఎస్టీఎస్(తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్) ఎందుకు ఉపయోగించలేదు? బస్ స్టాల్స్‌లో షెడ్‌ల నిర్మాణాలు, బస్‌ డిపోల్లోని స్టాల్స్‌ వంటి తక్కువ మొత్తాలకు కాంట్రాక్టులు ఆన్‌లైన్‌లో ఉంచుతున్నప్పుడు, కోట్లాది రూపాయల విలువైన కాంట్రాక్టును ఆన్‌లైన్ ఈ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో పారదర్శకంగా ఎందుకు చేయలేదు?" అని బీఆర్ఎస్ ప్రశ్నించింది.

"టీజీఎస్ఆర్టీసీ ప్రెస్ నోట్‌లో రాష్ట్ర ప్రభుత్వం లేదా రవాణా మంత్రికి ఎటువంటి పాత్ర లేదని పేర్కొంటూ రవాణా మంత్రిని రక్షించే ప్రయత్నం ఉంది. టీజీఎస్ఆర్టీసీ ఒక కమిషన్ కాదు, ఇది ప్రభుత్వంలో విలీనం చేసిన కార్పొరేషన్. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి బ్యూరోక్రాట్‌లు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్నారని గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రవాణా మంత్రికి సంబంధం లేదని మీరు చెబితే, ఇంత పెద్ద కాంట్రాక్ట్ బోర్డుకు తెలియకుండా ఉంచారా అనే అనుమానం వస్తుంది" అని బీఆర్ఎస్ అభిప్రాయపడింది.

"మహాలక్ష్మి పథకం పన్ను చెల్లింపుదారుల డబ్బుతో పనిచేస్తోంది, పురుష ప్రయాణికులు టికెట్లు కొనుగోలు చేయడంతో కొనసాగిస్తున్నారు. మహాలక్ష్మి పథకం ముసుగులో ప్రభుత్వం ఒక నిర్దిష్ట కంపెనీకి లబ్ధి చేకూర్చడం ద్వారా బహిరంగంగా స్కామ్ చేస్తుంది. కర్ణాటక ప్రభుత్వం అదే మహాలక్ష్మి పథకం కోసం శక్తి స్మార్ట్ కార్డ్‌లను జారీ చేసింది. వాళ్లు ఈ-గవర్నెన్స్ పోర్టల్ ద్వారా టెండర్ ప్రక్రియను కూడా నిర్వహించారు. దానిని అధ్యయనం కోసం ఎందుకు పరిగణించలేదు. హైదరాబాద్ మెట్రో ఇప్పటికే యూపీఐ, స్మార్ట్ కార్డ్ సేవలతో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్‌ని ఉపయోగిస్తోందని తెలియకపోవడం ఆశ్చర్యం కలుగుతుంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు జీరో టిక్కెట్‌ను జారీ చేస్తారు. అయితే కంపెనీ దాని కమిషన్‌ను పొందుతుంది. అందుకే ఒప్పందంలో మహాలక్ష్మి ప్రయాణికులతో పాటు పురుషులు కొనుగోలు చేసిన టికెట్లతో 30 లక్షల టికెట్ లావాదేవీలను పేర్కొన్నారు. మహిళా పథకంలో అవినీత జరగకుండా పారదర్శకత పాటించడం ప్రభుత్వ బాధ్యత.

కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మొత్తం ప్రెస్ నోట్ కొన్ని ప్రయోజనాలకు అనుకూలంగా వ్యత్యాసాలు, నిబంధనల ఉల్లంఘనలను వివరిస్తుంది. నోట్ షీట్/కాంట్రాక్ట్ ఫైల్ నిర్దిష్ట పత్రాలు, బిడ్డర్లు వారి కొటేషన్లు, అన్ని వివరాలు, ఉన్నత స్థాయి కమిటీ నివేదికలు, కమిటీ సభ్యుల పేరు, హోదా, మార్చిలో కార్పొరేషన్ నిర్వహించిన వివిధ అధ్యయన నివేదికలను వీక్షించడానికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని క్రిశాంక్ అన్నారు.

నిరాధారమైన ఆరోపణలు -టీజీఎస్ఆర్టీసీ

ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం అమలు విషయంలో చేస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు బోర్డు అనుమతితోనే ఈ వ్యవస్థను సంస్థ అమలు చేస్తుందని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించిందని చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోందని తెలిపింది. నియమ నిబంధనలకు లోబడి బోర్డు అనుమతితోనే సంస్థలో నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేస్తోంది.

Read Entire Article