TGSRTC : బస్ స్టేషన్ లో పుట్టిన పాపకు లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ - ఆర్టీసీ ఎండీ సజ్జనార్

3 months ago 62
ARTICLE AD

TGSRTC : కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిప్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. కరీంనగర్ బస్ స్టేషన్ లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి చీరను అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించారు.

ఈ నెల 16న కుమారి అనే గర్భిణీ, తన భర్తతో కలిసి భద్రాచలం బస్సు కోసం కరీంనగర్ బస్ స్టేషన్ కు వచ్చారు. ఆమెకు బస్ స్టేషన్ లో నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ లోగా నొప్పులు ఎక్కువ కావడంతో.. ఆర్టీసీ మహిళా సిబ్బంది ముందుకు వచ్చారు. చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. అనంతరం అంబులెన్స్ సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

సమయస్ఫూర్తితో వ్యవహారించి.. సకాలంలో కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్య సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని ప్రశంసించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి అభినందనలు

కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్భిణీకి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులను రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో మంగళవారం ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్యలను సన్మానించి.. వారికి రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ కలెక్టర్ ప్రమీల సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్, రీజినల్ మేనేజర్ సుచరిత పాల్గొన్నారు.

Read Entire Article