సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంపై వేడెక్కిన రాజకీయం

2 months ago 62
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంపై వేడెక్కిన రాజకీయం

ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంపై తెలంగాణలో రాజకీయం వేడెక్కింది.

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Jitender Gupta)

సింగరేణి కాలరీస్‌‌కు రిజర్వేషన్ పద్ధతిలో దక్కాల్సిన బొగ్గు బ్లాకులను వేలం వేయరాదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరడం, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొగ్గు బ్లాకుల వేలంపై మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్ ప్రశ్నించడం, దీనికి ముఖ్యమంత్రి కౌంటర్ ఇవ్వడంతో తెలంగాణ బొగ్గు బ్లాకుల కేటాయింపు అంశం వేడెక్కింది.

శుక్రవారం అర్థరాత్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్‌లో చేసిన పోస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. 10వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభోత్సవానికి హాజరైన విక్రమార్క ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించి, వేలం ప్రక్రియలో పాల్గొనకుండా గోదావరి పరీవాహక ప్రాంతంలో సింగరేణికి రిజర్వేషన్ కోటా కింద బొగ్గు బ్లాకులను కేటాయించాలని కోరారు.

ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కూడా అయిన కిషన్ రెడ్డిని కోరారు. అవసరమైతే అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి ప్రధానిని కలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సవరించిన మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్ మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం ద్వారా సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులను రిజర్వేషన్ విధానంలో కేటాయించే వెసులుబాటు కలుగుతుందన్నారు.

కిషన్ రెడ్డి స్పందన ఇదీ

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) 51:49 ఈక్విటీ ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం సంయుక్త యాజమాన్యంలోని ప్రభుత్వ బొగ్గు గనుల సంస్థ. సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణిలో ప్రస్తుతం 39 బొగ్గు గనులు ఉన్నాయని, అయితే కొత్త గనుల కేటాయింపులు లేకపోతే ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోతాయని అన్నారు.

పాత గనులకు ఆనుకుని ఉన్న నాలుగు కీలకమైన బొగ్గు బ్లాకులను అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలతో కేటాయించాలని సింగరేణి ఇప్పటికే బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. అయితే ఈ నాలుగు బ్లాకులను వేలం వేయాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థను ఆదుకోవాలని, సింగరేణి వేలాది మందికి ఉపాధి కల్పిస్తోందని భట్టి విక్రమార్క విన్నవించారు.

అయితే ఈ అంశాలను పరిశీలిస్తామని, ప్రధానితో కూడా చర్చిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. సింగరేణి ప్రయోజనాల కోసం కేంద్రం పని చేస్తుందన్నారు. గతంలో సింగరేణికి కేటాయించిన నైని బొగ్గు బ్లాకులో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. వివిధ కారణాల వల్ల సదరు బ్లాక్‌లో ఉత్పత్తి ప్రారంభం కాలేదని తెలిపారు.

"మిషన్ మోడ్‌లో, మేం ఉత్పత్తిని చేపట్టగలమని మీకు హామీ ఇస్తున్నాం. సింగరేణిలో 15 శాతం ఉత్పత్తి నైనీ బొగ్గు బ్లాకు నుంచే లభిస్తుంది. నేను కూడా తెలంగాణకు చెందిన వాడిని కాబట్టి, రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి ప్రాముఖ్యత నాకు తెలుసు. ప్రధానితో చర్చిస్తా' అని విక్రమార్క ఆందోళనపై కిషన్ రెడ్డి స్పందించారు. లబ్ధి పొందేది రాష్ట్ర ప్రభుత్వాలే తప్ప కేంద్రం కాదని ఆయన అన్నారు.

కేటీఆర్ విమర్శలు

బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేసి నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికి బదలాయించాలని 2021లో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కన్నారు. ‘కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలను విస్మయానికి గురిచేస్తూ గతంలో మీరు, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిన వేలంపాటలో పాల్గొనేందుకు, ప్రచారం చేయడానికి మీ డిప్యూటీ సీఎంను పంపారు!’ అని కేటీఆర్ అన్నారు. "మీ మనసు మారడానికి కారణాలు, దీనికి దారితీసిన ఒత్తిళ్లు (ఏవైనా ఉంటే) మీరు వివరించగలరా?’ అని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కౌంటర్

కేటీఆర్ తండ్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణిలోని రెండు బొగ్గు బ్లాకులను రెండు ప్రైవేటు సంస్థలకు అమ్మేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎప్పుడూ దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి బ్లాకుల ప్రైవేటీకరణ, వేలాన్ని వ్యతిరేకించడమే కాకుండా రెండు ప్రైవేటు సంస్థలకు విక్రయించిన బ్లాకులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసేందుకు విక్రమార్క ఈ కార్యక్రమానికి హాజరయ్యారని తెలిపారు. బొగ్గు గనుల వేలంపై గత ప్రభుత్వం నిర్వాకాన్ని ఎండగడుతూ సీఎం రేవంత్​ రెడ్డి సూటిగా, ఘాటుగా ఎక్స్​లో స్పందించారు.

‘కేటీఆర్ గారూ, పదేండ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మాటలను మీరు పట్టించుకోలేదు. కనీసం వినడానికి కూడా ఇష్టపడలేదు. మీరు ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం కూడా లేదు. అయినప్పటికీ.. మీలో మార్పు రావాలని కోరుకుంటూ.. ఈ వాస్తవాలను మరోమారు తెలియజేస్తున్నాం.

1. మన సంస్థల ప్రైవేటీకరణను, మన ప్రజల వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టినా, గత కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించినా సరే.. కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులందరూ అడుగడుగునా వ్యతిరేకించారు.

2. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను మొట్టమొదటి సారి వేలం వేసింది. రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. అరబిందో మరియు అవంతిక అనే రెండు కంపెనీలకు కట్టబెట్టింది మీ ప్రభుత్వ హయాంలోనే. అందుకు సహకరించింది మీ ప్రభుత్వమే. అప్పుడు మీరు, మీ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదు..?

3. మా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు సింగరేణి గనులను ప్రైవేటీకరించడం మరియు వేలం వేయడాన్ని వ్యతిరేకించారు. మీ ప్రియమైన అవంతిక మరియు అరబిందో కంపెనీలకు మీరు అప్పగించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.

4. తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, వారి ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌తో సురక్షితం. మన బొగ్గు.. మన హక్కు. కాపాడి తీరుతాం. తెలంగాణ ప్రజల ప్రతి హక్కు కోసం పోరాడుతాం.

5. అసలు విచిత్రమేమిటంటే.. అటు సింగరేణిని , ఇటు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ను టోకున ప్రైవేటుకు అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరం..’ అని ఎక్స్‌లో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

(పీటీఐ ఏజెన్సీ ఇన్‌పుట్స్‌తో)

Read Entire Article