Karimnagar : భూ అక్రమ దందాపై పోలీసుల కొరడా - 21 మందిపై కేసులు, ఎమ్మెల్యే అనుచరుడు అరెస్ట్..!

1 month ago 58
ARTICLE AD

హైడ్రా తరహాలో కరీంనగర్ పోలీసులు భూ అక్రమ దందాలపై కొరడా ఝుళిపిస్తున్నారు.‌ తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించిన బీఆర్ఎస్ నేత, చాంబర్ ఆఫ్ కామర్స్ కరీంనగర్ అధ్యక్షుడు చిట్టుమల్ల శ్రీనివాస్ తో సహా 21 మందిపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ ఆయన కుమారుడు తోపాటు ఆరుగురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.‌15 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.

మానకొండూరు మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 1262 లోని భూమి అక్రమ రిజిస్ట్రేషన్ లో కరీంనగర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు, బిఆర్ఎస్ నాయకులు చిట్టుమల్ల శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి నీరుమల్ల శ్యాంకుమార్ ను మోసం చేశారు. డబ్బులు ఇవ్వకుండా బెదిరించి అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని.. అందుకు బిఆర్ఎస్ నాయకులు సహకరించారని బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు.‌

కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఏ1 గా చిట్టుమల్ల శ్రీనివాస్ ఆయన కుమారుడు సాప్ట్ వేర్ ఇంజినీర్ చిట్టుమల్ల అచ్యుత్ చైతన్య (32), గంప నాగరాజు, దేశబోయిన శ్రీకాంత్, దేశబోయిన గోపి, దేశబోయిన శ్రీనివాస్, దేశబోయిన జగత్ ప్రకాష్, గంప రమేష్, కొండ మురళి, వంగల సంతోష్ కుమార్, గంప లవకుమార్, గంప రవళి, వంగల గీత, గంప ఫణీంద్ర, యాంసాని రాధాకృష్ణ, ఆకుల సుదర్శన్, రేగొండ సందీప్, మాకువెంకట శారద దేవి, బొల్లినేని సృజన్ రావు, కొత్త జైపాల్ రెడ్డి, దువ్వంతుల లక్షారెడ్డిలపై క్రైం నంబర్ 550/2024 318(4), 338, 336 (3), 340 (2), 308 (5), 61 (2), 351 (3), 3 2 3 (5) యాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు.

ఆరుగురు అరెస్ట్...

భూమి అక్రమ రిజిస్ట్రేషన్ లో ఏ1 గా ఉన్న చిట్టుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం పోలీసులు చిట్టుమల్ల శ్రీనివాస్ తోపాటు ఆయన తనయుడు చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న అచ్యుత్ చైతన్య(32), గంప నాగరాజు (48), దేశబోయిన శ్రీకాంత్ (42), దేశబోయిన గోపి (58), దేశబోయిన శ్రీనివాస్ (57)లను అరెస్ట్ చేశారు. కరీంనగర్ కోర్టులో హాజరు పర్చగా మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో కరీంనగర్ జైల్ కు తరలించారు.

మిగతా వారు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసు విచారణ ఇంకా చేయాల్సి ఉన్నందున వారిని కస్టడి తీసుకునేందుకు పిటిషన్ దాఖలు చేయాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు.

పరారీలో 15 మంది...

ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. దేశబోయిన జగత్ ప్రకాష్, గంప రమేష్, కొండ మురళి, వంగల సంతోష్ కుమార్, గంప లవ కుమార్, గంప రవళి, వంగల గీత, గం ఫణీంద్ర, యాంసాని రాధాకృష్ణ, ఆకుల సుదర్శన్, రేగొండ సందీప్, మాకు వెంకట శారద దేవి, బొల్లినేని సృజన్ రావు, కొత్త జైపాల్ రెడ్డి, దువ్వంతుల లక్షారెడ్డిలు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు.

ఆరు మాసాల క్రితం భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టిన సిపి అభిషేక్ మోహంతి నేతృత్వంలోని ఎకనామిక్ అఫేన్స్ వింగ్ పోలీసులు… దూకుడుగా ముందుకెళ్తున్నారు. తాజా అరెస్టు లతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇదివరకు తహశిల్దార్, సిఐతో సహా పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపించారు. మళ్లీ అరెస్టుల పర్వం ప్రారంభం కావడంతో భూ కబ్జాలు అక్రమ నిర్మాణాలు చేసిన వారు భయాందోళన చెందుతున్నారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Read Entire Article