Musi Row: మూసీ ప్రక్షాళన అనేది పెద్ద స్కాం.. ముందు హైడ్రా ఆఫీసును కూల్చండి: కేటీఆర్

2 weeks ago 35
ARTICLE AD

మీకు దమ్ముంటే ముందు నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ల మీద చర్యలు తీసుకోవాలని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆనాడు ఏ అధికారులు అయితే పర్మిషన్ ఇచ్చారో.. వాళ్ల మీద చర్య తీసుకోవాలని సూచించారు. తాము హైదరాబాద్‌లో చెరువులు, వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గురించి 2016లో జీవో ఇచ్చేదాక.. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు.

'మూసీ ప్రక్షాళన అనేది పెద్ద స్కాం. 2400 కిలోమీటర్లు ఉండే గంగానది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది. అదే 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు రూ. లక్షా 50 వేల కోట్లు అవుతుందంటే.. దీన్ని స్కాం అనే అంటారు. కూల్చే పరిస్థితులు వస్తే.. ముందు కూల్చాల్సింది హుస్సేన్ సాగర్ నాలా మీద ఉన్న హైడ్రా కార్యాలయాన్ని కుల్చండి' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'హైదరాబాద్ ప్రతిష్ట పెంచి, కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకు వచ్చి.. లక్షల ఉద్యోగాల కల్పన చేయడానికి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది చేయాల్సిన పని. ఈ పని గత ప్రభుత్వాలు చెయ్యలేదు. ఇప్పుడు ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షమేరకు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మొదలు పెట్టాము' అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి వివరించారు.

'హైడ్రా మంచిది అనుకోని మద్దతు ఇచ్చాం. కానీ ఇలా అయితదని అనుకోలేదు. మేము హైడ్రా మంచి ఆలోచనతో ఉంది, ప్రభుత్వం మంచి ప్లాన్ తో ఉంది కదా అనుకున్నాం. కానీ హైడ్రాతో పేద ప్రజల ఉసురు పోసుకుంటారని, పేదల పొట్ట కొడతారని, పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తారని అనుకోలేదు' అని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు 12లో ఉన్న తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వారిని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైడ్రాపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ.. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకొని.. వారిని కొట్టారు.

అటు తెలంగాణ హైకోర్టులో హైడ్రాపై సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణకు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్ వర్చువల్‌గా హాజరైరయ్యారు. తాము అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలని.. హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా అంటూ హైడ్రా కమిషనర్‌ను ప్రశ్నించింది. అటు అమీన్‌ పూర్‌ తహశీల్దార్‌ పైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోపే ఎలా కూల్చుతారంటూ ధర్మాసనం సీరియస్‌ అయ్యింది.

Read Entire Article